వేదాంతము అనగా అతి ఉత్కృష్ఠ జ్ఞానం అయిన బ్రహ్మమును తెలుసుకోవటం కొరకు నిర్దేశించడిన ఆధ్యాత్మిక గ్రంథముల చివరి భా గములు. వీటినే ఉపనిషత్తులు అని పిలుస్తారు. వేదాంతమునకు అర్ధం అంత్యజ్ఞానం. వేదములు అనేవి ఏ ఒక్క గ్రంథము నుండో గ్రహించినవి కావు. అవి స్వతస్సిద్ధములు, అపౌరుషేయములు. వ్రాయబడినవి కావు. వేదాంతమును 'ఉత్తర మీమాంస' అని కూడా చెప్పబడింది. అనగ తరువాతి విచారణ లేదా అధికోన్నత విచారణ అని అర్ధం. ఈ నామం 'పూర్వ మీమాంస' యజ్ఞ, యాగాదులు, ఉపాసనలకు సంబంధించిన మంత్రముల సముదాయము. (వేదాలలోని సంహిత భాగం).
వేదములే మన మనుగడకు ఆధారము. ఇది అందరకు తెలిసిన విషయము. కొద్ది మందికి మాత్రమే తెలిసిన లోతైన విషయమును, నలుగురికి తెలియచేసే అవకాశము కల్పించిన వారికి ధన్యవాదములు. నాల్గు వేదములలో, ప్రతి వేదమును రెండు భాగములుగా విభజించ వచ్చు. మొదటి భాగము కర్మ ఖాండ కాగా, రెండవది లేక చివరి భాగము అయినవి వేదాంతములు అని చెప్తారు. వీటినే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని కూడా తెలుసుకొన వచ్చు.
ప్రతి వేదములోని ప్రథమ భాగములో, కర్మ ఖాండ విషయములు అనగా ధర్మ భద్ధంగా మనిషి యొక్క జీవన విధానాన్ని నిర్ధేశించబడి ఉన్నాయి. దీని ఆధారముతోనే మనుస్మృతి (మనువుచే వ్రాయబడినది, ధర్మ సూత్రములు ( జైమిని కారులచే వ్రాయబడినవి) వచ్చాయి. యోగాదులు, ధ్యానం, ఆయుర్వేదం, ఇది అది అని చెప్పనవుసరము లేదు. హైందవ సాంప్రదాయంలో మానవునికి కావలసిన అన్ని ధర్మ సూక్ష్మములు ఇక్కడే లభ్యం.దీనినే అపర విద్య అని చెప్పారు. ఇది క్లుప్తంగ ఇంత వరకు తెలుసుకుందాము.
ఇక రెండవది ఉత్తర భాగం. దీనినే ఉపనిషత్తులు అని చెప్పారు. ఈవిద్య పర విద్య. వేయికి పైగా ఉపనిషత్తులు ఉండగా, 108 మాత్రము బాగా లభ్యము కాగా, అందులో 10 ఉపనిషత్తులు, అంటే దశోపనిషత్తులు మాత్రము ముఖ్యముగా ప్రాచుర్యము పొంది ఉన్నాయి. ఈ దశోపనిషత్తులకు మాత్రమే, ఆదిశంకరులవారు వ్యాఖ్యానములు వ్రాసి ఉన్నారు. అవే మనకు రక్ష అయి ఉన్నాయి. పరమాత్మ, సృష్టి కర్త అయిన భగవంతుని యథార్థ ఉనికి తెలుసుకోదలచిన వారికి ఇవే శరణ్యం. ఇందలి రహస్యములను, సూత్రములుగా వ్రాసినారు వేదవ్యాసభగవానుడు. ఆవే బ్రహ్మసూత్రములు. వీటికి గూడ భాష్యము వ్రాసినారు ఆదిశంకరులవారు.
ఈ పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని చెప్పబడే ఈ వేదములు, పరాపర విద్యలని తెలుసుకోవాలి. ఇవి యెవరో ఒక వ్యక్తిచే గాని, మరేదయినా పద్ధతిలో వ్రాయబడి వుండలేదు. కేవలము వినపడినవి. శ్రవణములు మాత్రమే. అందు వలననే వానిని అపౌరుషేయములని అన్నారు. అనగ ఏ మానవుని సృష్టి కాదు. ఈ భాగమునకు (ఉపనిషద్ భాగమునకు) రాగానే, గురువుగారు, మునుపటి భాగములో చెప్పిన సర్వమును ఖండించి, నేతి నేతి మాటలతో, జగన్మిథ్య, (అనగా జగత్తు పరమాత్మచే కల్పితము మాత్రమే) అనియు, పరమాత్మయే సత్యం అని బోధించుతారు. ఇక్కడ కర్మ ఖాండ పూర్తిగా నిషేధించ బడుతుంది. కర్మ ఖాండ నిషేధమునకు ఒప్పుకొ గల్గిన, శమ దమాదులు కలిగిన ఉత్తమ అధికారత్వము పొందిన వారికి మాత్రమే ఈ శాస్త్రము అబ్బుతంది. శాస్త్రం వారిని "కశ్ఛిత్ ధీరాః" ఒకానొక ధీరుడు లేక వివేకి మాత్రమే ఈ శాస్త్రార్ధం గ్రహించగలడు అని నిష్కర్షగ చెప్తుంది.